ద జర్నీ
ఊగుతూ తూగుతూ వెళ్తున్న బస్సులో ఆపాటి కదలిక కూడా ఆగిపోయింది. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న నేను డ్రైవరువైపు చూశాను విసుగ్గా. అతడికి కళ్ళు నిలువుగుడ్లు పడున్నాయి. ఊపిరి ఆడనట్లుగా ఎగశ్వాశ తీస్తున్నాడు. ఎదురుగా రోడ్డు మీదకు చూస్తున్నాడు. నేను అప్రయత్నంగా అటు తల తిప్పాను. ఎవరో ముసలి వ్యక్తి. రోడ్డుకడ్డంగా నిలబడి బస్సు ఆపమన్నట్టు చేయి ఊపుతూ ముందుకొస్తున్నాడు. తెల్లటి పంచె , తలకు తువ్వాలు చుట్టి అచ్ఛం ఈ కుప్పం ప్రాంతం పేద రైతులాగే ఉన్నాడు. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడా దగ్గరిలో గ్రామాలేవీ లేవు. అది పలమనేరు దాటాక వచ్చే గుట్టలతో కూడిన అడవి ప్రాంతం. అప్పటికి అర్ధ రాత్రి పన్నెండున్నర అవు తోంది. కుప్పం నుంచి బస్సు బయలుదేరి రెండు గంటలు దాటింది. ఈ వేళప్పుడు , ఈ ముసలి రైతు ఇక్కడ ఎందుకున్నాడు ? దయ్యాలు , భూతాల మీద ఇక్కడి జనానికి నమ్మకం ఎక్కువ. అతడిని డ్రైవర్ దెయ్యమనే అనుకున్నాడా ? ఆ షాక్ వల్లే అలా అయిపోయాడా ? మళ్ళీ డ్రైవరు వైపు చూశాను. షాక్ నుంచి కాస్త తేరుకున్నట్టు కనిపిస్తున్నాడు కానీ , అతని ఒంట్లో వొణుకు మాత్రం తగ్గడంలేదు. " ఏం చౌడప్పా , బాగుండావా ? ఈమజ్జ మా నాయనూరు రూట్లో రావడం లేద...